తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ లో సీటు ఆశించి భంగపడ్డ అసంతృప్త నాయకులు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్ కు రాజీనామా చేయగా ... తాజాగా మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ కూడా అదేబాటలో నడుస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడిన ప్రహ్లాద్ బీజేపిలో చేరడానికి సిద్దమైనట్లు... ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే టికెట్ ను... జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతికి కేటాయించారు. దీంతో ఈ టికెట్ ఆశించిన మాజీ మంత్రి చందూలాల్ తనయుడు ప్రహ్లాద్ తీవ్ర అసంతృప్తికి గురై... బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 12న భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో ప్రహ్లాద్ కాషాయ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. మరోవైపు... కోదాడ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు కేటాయించడంతో బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ మరొకరికి ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
బొల్లం మల్లయ్య యాదవ్ 2018 ఎన్నికలల్లో చివరి నిమిషంలో ... టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చి టికెట్ సంపాదించి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్.పద్మావతి రెడ్డి ఓడిపోయారు. దీంతో కోదాడ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కాకుండా తొలిసారి గెలిచిన మూడో పార్టీగా బీఆర్ఎస్ బోణీ చేసింది. వాస్తవంగా... 2018 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ను ... తొలినుంచీ ఆ పార్టీలోనే ఉన్న ఉద్యమకారుడు శశిధర్ రెడ్డి ఆశించారు. కానీ, ఆయనకు టికెట్ నిరాకరించి టీడీపీ నుంచి వచ్చిన బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇచ్చారు. అప్పటికే పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, ఎర్నేని బాబు వంటి వారిని మల్లయ్య యాదవ్ ప్రసన్నం చేసుకోవడంతో ఆ ఎన్నికల్లో గట్టెక్కారు. కానీ ఏ కారణం చేతనో ఆయన పార్టీ ఎజెండా కంటే సొంత ఎజెండాతో ముందుకు వెళ్లారు. దీంతో ముందు నుంచీ బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఆయనకు దూరమయ్యారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఒక వర్గంగా.. పార్టీలో ముందు నుంచీ ఉన్నవారు.. మరోవర్గంగా రాజకీయాలు నడిచాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ కట్ చేయాలని, తమలో ఒకరికి ఇవ్వాలని, లేదంటే ఆయన గెలవడం కష్టమని చెబుతూ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు నాయకత్వంలో అధిష్టానాన్ని కలిసి వివరించారు. పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు పంచాయితీ వెళ్లిందని కూడా చెబుతున్నారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి చేరుకోగానే.. ఆయనను కలిసి పరిస్థితిని వివరిస్తామని పేర్కొంటున్నారు. ఆయన రాక కోసమే వెయిట్ చేస్తున్నామని, టికెట్ మార్చకుంటే ఎవరి దారి వారు చూసుకోవడం మినహా మరో మార్గం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి రాకకోసం ఎదురు చూస్తున్న అసమ్మతి నాయకులు తమ మాట చెల్లుబాటు కాకుంటే ప్రత్యామ్నాయం చూసుకునే ఆలోచనల్లోనూ ఉన్నారని తెలుస్తోంది. సో... రాష్ట్రంలో పలుచోట్ల తలె త్తుతున్న అసమ్మతులు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధినాయకత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos