నిన్నమొన్నటివరకు ... సామాన్యులు సైతం కిలోల కొద్దీ టమోటాను కొనగలిగారు. ఇప్పుడు సంపన్నులు మాత్రమే ఆ సాహసం చేయగలరు. నాడు... వంద రూపాయలకు 8కిలోల టమోటా కొనుగోలు చేయగా... ఇప్పుడు కిలో కాయలు కొనాలంటే ... 150 నుంచి 165 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ ధరలు రేపోమాపో తగ్గుతాయన్న ఆశలు కూడా గల్లంతవుతున్నాయి. రోజురోజుకీ పెరగడమే తప్ప తగ్గే జాడే కనిపించడం లేదు. కిలో టమాటా ధర ఇప్పుడు రిటైల్లో రూ.165కి పెరిగింది. రానున్న కొద్ది రోజుల్లో కేజీ రూ.200 ఖాయమన్న మాట వినిపిస్తోంది.
చాలాచోట్ల భారీ వర్షాలు కురిసి పంటనష్టం వాటిల్లింది. ఫలితంగా... డిమాండ్కి తగ్గట్టుగా సప్లై జరగడం లేదు. టమాటా బాటలోనే పచ్చి మిర్చి ధర కూడా ఘాటెక్కింది. మంట పుట్టించే ధరలతో చుక్కలు చూపిస్తోంది. మిర్చి విషయాన్ని కాసేపు పక్కన పెడితే... టమోటా ధర ఎందుకు పెరుగుతూ పోతోందనే విషయమే ఇప్పుడు అన్నివర్గాల్లోను హాట్ టాపిక్ గా మారింది. పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో దిగుబడులు తగ్గి... డిమాండ్ భారీగా పెరగడమనే కారణమొక్కటే కాకుండా... వ్యాపారులు సైతం టమాటా ధరలను అడ్డగోలుగా పెంచేశారనే మాట వినిపిస్తోంది.
పైగా.. తెలుగు రాష్ట్రాల్లో టమాటాను పండించే విస్తీర్ణం తగ్గటం.. ఇతర రాష్ట్రాల్లో వాటికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో.. అక్కడికి పంపేందుకు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా ... మన తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ లలోకి అవసరానికి తగినంతగా ఉత్పత్తులు రావడం లేదు. దీంతో... రానున్న రెండు వారాల్లో కేజీ టమాటా రూ.200 దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఇప్పటికే కోల్కత్తాలోని రిటైల్ మార్కెట్లలో కిలో టమాటా ధర రూ.152గా ఉంది. ఢిల్లీలో రూ.120, చెన్నైలో రూ.117,ముంబయిలో రూ.108గా నమోదైంది. ఇవన్నీ నిన్నటి లెక్కలు. ప్రస్తుతం వాటిధరలు మరింతగా పెరిగాయి. అత్యధికంగా ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పూర్లో కిలో టమాటా రూ.162 పలుకుతోంది. అత్యంత తక్కువ ధర ఉంది ఒక్క రాజస్థాన్లోనే. అక్కడి చురు జిల్లాలో కిలో టమాటా కేవలం రూ.31కే విక్రయిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఏటా జులై-ఆగస్టు మధ్య కాలంలో టమాటా ధరలు పెరుగుతుంటాయి. సరిగ్గా అదే సమయానికి వర్షాలు భారీగా కురవడం, పంట నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే...సప్లైపై ప్రభావం పడుతుంది. కానీ...ఈ సారి ఈ ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంది.
అందుకే...ఇంతలా ధరలు పెరిగిపోయాయి. ధరలు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో ... దొంగలు టమోటాలను సైతం బంగారంలాగా భావించి దొంగతనం చేస్తూ... హాయిగా నచ్చిన రేట్లకు అమ్ముకుంటున్నారు. కర్ణాటక లోని హసన్ జిల్లాలో ... టమాటా పండించిన ఓ మహిళా రైతు ... ధరలు పెరగడం వల్ల మంచి ఆదాయం వస్తుందని సంబర పడింది. పంటకోసి మార్కెట్కి తీసుకెళ్దామని ప్రయత్నాలు చేసుకునే లోపే దొంగలు మొత్తం టమోటానంతా ఊడ్చుకెళ్లారు. ఒక్క కాయ కూడా మిగలలేదు. దాదాపు రూ.2.5 లక్షల విలువైన టమాటాలను దొంగతనం చేశారు. అదేవిధంగా... తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో టమోటాల చోరీ కేసు నమోదైంది.
20 కేజీల టమాటా బాక్స్ ను ఒక వ్యాపారి తన షాపు బయట ఉంచగా... వాటిని దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ తరహా చోరీల వార్తలు పలు ఇతర ప్రాంతాల్లో కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో... ఓసీ టమోటా... నీక్కూడా ఎంత డిమాండ్ వచ్చిందే అంటూ ఇరుగుపొరుగు అమ్మలక్కలు తెగ ముచ్చటించేసుకుంటున్నారు. ఇదండీ ప్రస్తుతం టమోటా ... సామాన్యుడిపై చూపుతున్న రేట్ పవర్. ఈ రేటు ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూడటం తప్ప మనమేం చేయగలం మరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos