ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మిచౌంగ్ తుఫాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు ఆందోళనలో ఉన్నా .. సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను వదలడం లేదు. తుఫానుపై వారం నుంచే హెచ్చరికలు ఉన్నా అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడంలో జగన్ విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన ఆహారం, పునరావసంతో పాటు చివరకు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేశారు. తుఫానుపై తూతూమంత్రంగా సమీక్ష చేసి చేతులు దులుపుకున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ముందుచూపు లేమి వల్ల ... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడపాల్సిన పరిస్థితి ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.7 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులను రైతులు కోల్పోయారు. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి, కుప్పలపైన ఆరబోసిన వరి తీవ్రంగా దెబ్బతింది. అలాగే పొగాకు, పత్తి, మిర్చి, శనగ, అరటి, బొప్పాయి, మినుము, అపరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంతాల్లో ఇంటికో భోజనం పొట్లం ఇచ్చి సరిపెట్టుకోమనడం జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవడంతో పాటు.. బాధితులకు అండగా నిలవాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పరిహారం పెంచి ఇవ్వాలని అన్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. తుపాను తీవ్రతపై కేంద్ర విపత్తు సంస్థలు గత వారం రోజుల నుంచే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టిందని విమర్శించారు. తుపాను హెచ్చరికలపై రాష్ట్ర ప్రభుత్వం కనీస సమీక్ష జరపకపోవడం దారుణమని పేర్కొన్నారు. తుపాను పరిస్థితులపై అప్రమత్తం చేయడం నుంచి సహాయక చర్యలు చేపట్టడం వరకు అన్నింటా ప్రభుత్వం విఫలమైందని లోకేష్ అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఎప్పుడు, ఏ విపత్తు వచ్చినా ఆదుకునేది టీడీపీయేనని, అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ మానవతాదృక్పథంతో సాయం చేసేదని లోకేష్ వివరించారు. రాష్ట్రంలో తుపాను నష్టం తీవ్రస్థాయిలో ఉందని, ఈ కష్టకాలంలో ప్రజలకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బాధితులకు ఆహారం, ఇతరత్రా సాయం అందించాలని సూచించార అదేవిధంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్ధిక సహకారం మంజూరు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని కోరారు. మిచౌంగ్ తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆహారాధాన్యాలతో పాటు ఉద్యానవన పంటలతో సహా పలు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అయితే భీమా చేసిన రైతాంగం ఎంతమంది.. లేనివారు ఎంతమంది అనే గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టక పోవడం వల్ల రైతాంగం ఆందోళన చెందే పరిస్ధితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని దగ్గుబాటి పురంధరేశ్వరి డిమాండ్ చేశారు.ఇదిలావుండగా... తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ప్రస్తుతం తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని... తుఫాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయని అన్నారు. కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తిరిగి బాధితులకు సకాలంలో సాయం అందించాలని... పది రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా సరే ... బాధితులకు మంచి సహాయం అందాలని... బాధితులకు చేసే సాయంలో లోటు రాకూడదని అన్నారు. వర్షాల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10వేలు ఇవ్వాలని... క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంలోనూ వారికి అవసరమైన సాయం చేయాలని... పొలాల్లో నీటిని త్వరితగతిన తొలగించాలని... పంటపొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos