ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇద్దరూ వేర్వేరుగా వ్యక్తిగత పనుల కోసం ఈ పర్యటనలు చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ సీబీఐ కోర్టును అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. లండన్లో తన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు కోర్టును సమయం కోరారు. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టు.. సీఎం జగన్ పిటిషన్పై విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ అభ్యంతరాలు చెప్పకపోతే విదేశీ టూర్లు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిస్తుంది. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించడానికి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి తన పిటిషన్లో కోరారు. విజయసాయిరెడ్డి పిటిషన్పై కూడా కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. ఈ నెల 30వ తేదీన విచారణ జరగనుంది. సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకూ యూరప్ టూర్ లో ఉంటారు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు విజయసాయిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ కోర్టు పలు షరతులు విధించింది. ఇందులో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లరాదనే షరతు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వీరిద్దరూ విదేశీ పర్యటనలకు అనుమతి కోరారు. గతంలోనూ సాయిరెడ్డి ఓసారి కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ దాఖలు చేసుకున్న పిటిషన్లపై స్పందించేందుకు సీబీఐ గడువు కోరడంతో విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. ఏం జరుగుతుందోమరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos