తిరుమలలోని శేషాచల కొండల్లో చిరుత, ఎలుగుబంటి వంటి ప్రమాదకర జంతువుల తాకిడితో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. తిరుమల అలిపిరి నడకదారిలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే ఇప్పుడు శ్రీవారిమెట్ల మార్గంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. ఈ ఎలుగుబంటి తాజాగా... 2 వేల నంబర్ మెట్టు దగ్గర భక్తులకు కనిపించింది. అడవిలో నుంచి ఎలుగు రావడాన్ని గుర్తించిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు మైకుల్లో ప్రకటన చేసి... నడక దారిలో వస్తున్న మిగతా భక్తులను అప్రమత్తం చేశారు. ఎలుగుబంటి తిరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఎలుగు తిరిగి అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా... లక్షితపై చిరుత దాడి చేసి చంపేయడంతో... టీటీడీ అప్రమత్తం అయింది. శేషాచలం అడవుల్లో దాదాపు 25-30 చిరుతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఇప్పుడు ఎలుగుబంటి కనిపించటం కలకలంగా మారింది. దీంతో, కాలినడకన మార్గంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ... టీటీడీ... ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది. ఏడో మైలు వద్ద నుంచి చిన్న పిల్లల చేతికి పోలీసులు ట్యాగ్ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే సులభంగా కనిపెట్టేందుకు ట్యాగులపై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్, పోలీసు టోల్ ఫ్రీ నెంబర్ను సిబ్బంది జత పరుస్తున్నారు. ఇదే సమయంలో నడకదారి భక్తులకు కల్పించే దివ్య దర్శనం రద్దు దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఈ స్థానంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను 15 వేల నుంచి 30 వేలకు పెంచాలని భావిస్తున్నారు. కాగా... మరో పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కూడా ఎలుగుబంటి కలకలం సృష్టించింది. శ్రీశైలం ఆలయం చుట్టుపక్కల కూడా ... తిరుమల మాదిరిగానే అటవీప్రాంతం ఉండటంతో తరచూ వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఎలుగుబంటి వంటి భయంకరమైన జంతువులు ఆలయ పరసరాల్లోకి రావడంతో స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. కొద్దిరోజుల క్రితమే శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం ఆలయం వద్ద ఇలాగే ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఆలయంలో ఎలుగుబంటిని చూసిన భక్తులు భయంతో పరుగుతీశారు. అయితే ఆ ఎలుగుబంటి ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా కేవలం కొబ్బరికాయలు తినేసి అక్కడినుండి వెళ్లిపోయింది. ఏదిఏమైనా భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos