ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారగా... తెలంగాణ పరిస్థితి కాస్త మెరుగుపడింది. 2022-23 సవరించిన బడ్జెట్ల విశ్లేషణ ఆధారంగా రూపొందించిన రాష్ట్రాల ర్యాంకుల్లో ఏపీ 11వ స్థానానికి పడిపోయింది. 2021-22 ర్యాంకుల్లో ఏపీ 8వ స్థానంలో ఉండేది. 17 రాష్ట్రాలపై డాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ దాస్ ఈ నివేదికను తయారు చేశారు. అందులోని వివరాల ప్రకారం.. 2022-23కు సంబంధించి తెలంగాణ నాలుగో ర్యాంకు నుంచి మూడో స్థానంలోకి వచ్చింది. స్థిరమైన ఆదాయ వనరులు, వ్యవసాయం, ఇతర రంగాల్లో అభివృద్ధి కారణంగా ... తెలంగాణ... తన ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకుంటోంది. మహారాష్ట్ర మొదటి స్థానంలో, చత్తీస్గఢ్ రెండో స్థానంలో నిలవగా... ఏపీ ప్రస్తుతం 11వ ర్యాంకుకు చేరింది. 2022-23 నివేదికలో అత్యంత దారుణ స్థితిలో ఉన్న రాష్ట్రాలుగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్లు ఉన్నాయి. గుజరాత్ కూడా 2021-22తో పోలిస్తే గుజరాత్ గత బడ్జెట్ అంచనాల ప్రకారం ఐదు నుంచి ఏడోస్థానానికి పడిపోయింది. కేరళ అత్యంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితి ఉన్న ఐదు రాష్ట్రాల జాబితా నుంచి బయటకు వచ్చింది. 2023-24కు సంబంధించిన ఏపీ ర్యాంకు వివరాలు తెలియరాలేదు. 17 రాష్ట్రాల ఆర్థిక స్థితిని బడ్జెట్లను విశ్లేషించి నాలుగు అంశాల ఆధారంగా కౌశిక్ దాస్ నిర్ణయించారు. ఆర్ధిక లోటు, సొంత పన్నుల ఆదాయం, రాష్ట్ర అప్పులస్థాయి, జీఎస్డీపీ శాతాలను ఈ ర్యాంకుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఇంకా రెవెన్యూ ఆదాయం నుంచి చెల్లించే అప్పులు, వడ్డీలను కూడా లెక్కలోకి తీసుకొని నివేదిక రూపొందించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos