తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. కొంత తగ్గినట్లు కనిపించినా రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పవని ... బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న కారణంగా మరో మూడు లేదా నాలుగురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఏపీలోని రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 42.8 అడుగులు, పోలవరం వద్ద నీటిమట్టం 11.85 మీటర్లకు చేరింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం కరకట్ట వద్ద స్నానఘట్టాలు మునిగిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.98 లక్షల క్యూసెక్కులుగా ఉంది. విపత్తుల సంస్థకు చెందిన స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. వరద ఉధృతి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుతుండటంతో ... అధికారులు... నదీపరీవాహక ప్రాంతాల్ని ఖాళీ చేయించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైనతేయ, వశిష్ట, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే లంక గ్రామాలు మూడు, నాలుగు రోజులుగా వరద ముంపులో కొట్టుమిట్టాడుతున్నాయి. అరటి, కూరగాయల పంట భూములన్నీ నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తీరం వెంబటి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని... మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చిరిక కేంద్రం పేర్కొంది. పోలవరంలోకి వస్తున్న వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలతో పాటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన క్రమంలో... రెండు రాష్ట్రాల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos