రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నేడు... టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్మరించుకున్నారు. చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని కొనియాడారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆత్మీయుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. 2018 ఆగస్ట్ 29న 61 ఏళ్ల హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా నార్కట్ పల్లి వద్ద టయోటా ఫార్చ్యూనర్ కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. ఆ సమయంలో కారును హరికృష్ణ స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. కారు అత్యంత వేగంగా వెళ్తున్న సమయంలో వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఆయన వెనక్కి తిరిగారు. ఈ క్రమంలో అదుపుతప్పి కారు ప్రమాదం జరగడంతో ఆయన కన్నుమూశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
లోకేశ్ కూడా ఈ సందర్భంగా నివాళులర్పించారు. తన మామయ్య హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా యువనేత గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మా హరి మామయ్య నిబద్ధతకు, నిజాయితీకి నిలువెత్తు రూపమని... దూకుడు ఆయన నైజం, కోపం తాత్కాలికం, ప్రేమ శాశ్వతం... మేనల్లుడిగా ఆయన ఆత్మీయత పొందడం నా అదృష్టమని పేర్కొన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా చేపట్టిన పదవులకే వన్నెతెచ్చిన నందమూరి హరికృష్ణ లేనిలోటు ఎవరూ తీర్చలేనిదని... హరి మామయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos