ఏపీ, తెలంగాణలో కురిసిన భారీవర్షాల కారణంగా వాగులు, వంకలు ఏకమయ్యాయి. చాలా ప్రాంతాల్లో జాతీయ రహదారులపైకి వరదనీరు చేరడంతో ట్రాఫిక్ను నిలిపివేస్తున్నారు. వరద కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై మరోమారు ట్రాఫిక్ నిలిచిపోయింది. మున్నేరు వాగు ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తుండడంతో ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ నుంచి విజయవాడ వైపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐతవరం వద్ద ట్రాఫిక్ను నిలిపివేశారు. వరద పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మున్నేరుకు ప్రస్తుతం 1,92,000 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు జాతీయ రహదారిపై వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుండపోతగా కురిసిన వర్షాల ప్రభావం నుంచి వరంగల్ ఇంకా కోలుకోలేదు. మళ్ళీ వాన బీభత్సం కొనసాగుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ నగరవ్యాప్తంగా వందకు పైగా కాలనీలు వరద నీట మునిగిపోయాయి. అధికారులు వరంగల్ నగర వ్యాప్తంగా 19 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ... బాధితులకు మౌలిక వసతులను కల్పిస్తున్నారు. అయితే అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారని ముంపు ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఇంకా చాలా ముంపు కాలనీల్లో ప్రజల తరలింపు ప్రక్రియ సాగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రకాళి దేవాలయానికి వెళ్లే మార్గంలో ఐదు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారు భవనాల పైకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ములుగు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ములుగు ఎమ్మెల్యే సీతక్క భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ముంపు గ్రామాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. జోరువానను సైతం లెక్క చెయ్యకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కొండాయి పరిసర గ్రామాలు జంపన్న వాగు ఉధృతితో వరద ముంపులో చిక్కుకున్నాయని, దాదాపు 100 మంది ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఉన్నారని... వారిని కాపాడాలని సీతక్క విజ్ఞప్తి చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. హెలికాఫ్టర్ పంపాలని సీతక్క చేసిన విన్నపాన్ని ప్రభుత్వం మన్నించింది. దీంతో కొండాయిలో పరిస్థితులపై మంత్రి సత్యవతి రాథోడ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. సత్యవతి రాథోడ్ చొరవతో ములుగు జిల్లా కొండాయి వద్ద జంపన్నవాగు వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు ఏపీలో గోదావరి పోటెత్తుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో భారీగా ఉంటోంది. ఇన్ ఫ్లో పెరుగుతోండటంతో అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద అవుట్ ఫ్లో 13.05 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. విపత్తు నిర్వహణ విభాగం అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 42 మండలాలపై పడింది. ఆయా మండలాల పరిధిలో ఉన్న 458 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరద పరిస్థితులపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించి... యుద్ధ ప్రాతిపదికన అన్నిరకాల సహాయక చర్యలు తీసుకోవాలని ... ముంపు గ్రామాల వారికి బాసటగా నిలవాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లకు 12 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని ఈ సందర్భంగా అధికారులు జగన్కు వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ... ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos