రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఒకప్పుడు రాష్ట్రాన్నే కాకుండా యావత్ దేశాన్ని వణికించిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా నిర్మిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటిస్తోంది. నటి రేణూ దేశాయ్ ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తూ... కీలకరోల్ లో నటించారు. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం ఎందుకు చర్చనీయాంశం అయిందంటే... టైగర్ నాగేశ్వరరావు మూవీ టీజర్ ఎరుకల సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని చుక్కా పాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పాటు... ఈ మూవీ విడుదల నిలిపి వేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు... టైగర్ నాగేశ్వరరావు చిత్రం టీజర్ లో వాడిన భాష ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని సీరియస్ అయ్యింది. సరైన అనుమతులు తీసుకోకుండా ఎలా విడుదల చేస్తారని మండిపడింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి లేకుండా టీజర్ విడుదల చేయడంపై అభ్యంతరం తెలిపింది. ఇలాంటి టీజర్స్ ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించింది. సినిమా మేకర్స్ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని... కేవలం డబ్బుల కోసం సినిమాలు తీయడం సరికాదని చెప్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్ పర్సన్ ని ప్రతివాదిగా చేర్చాలని సూచించింది. అలాగే సినిమాపై పిటిషనర్ కి ఉన్న అభ్యంతరాలు అన్నింటినీ సీబీఎఫ్సీ చైర్ పర్సన్ కి తెలియజేసేలా అనుమతి ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ ఠాకూర్, న్యాయమూర్తి ఆకుల శేషసాయిమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో టైగర్ నాగేశ్వరరావు మూవీ నిర్మాతకు, టీమ్ కు పెద్ద చిక్కు వచ్చి పడిందని ఫిల్మ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లొ మూవీ నిర్మాత ఎలా ముందుకు వెళతారనేది ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos