ఏపీలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. పవన్ వారాహి యాత్ర ప్రారంభించిన తరువాత కాపు రాజకీయం హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్న క్రమంలో... టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. ఏపీ ఎన్నికల్లో ఈ సారి కాపు ఓటింగ్ కీలకంగా మారుతున్నట్లుగా భావిస్తున్న క్రమంలో... పవన్ కాపు ఓటింగ్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇందుకు వైసీపీ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తోంది.
ఈ సమయంలో ఏపీ రాజకీయాలపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్మోహన్రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు కేసీఆర్ కొత్త వ్యూహానికి తెరలేపారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జగన్ వైఖరిపై తీవ్ర అసహనంతో ఉన్నారని భావిస్తున్న కాపుల ఓట్లు గంపగుత్తగా టీడీపీ-జనసేనకు వెళ్లకుండా.. కేసీఆర్... వాటిని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్లో కాపు వర్గానికి చెందిన కొందరు మాజీ ఐఏఎస్ అధికారులతో సమావేశం కావడాన్ని వారు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. వీరిలో మాజీ ఐఏఎస్ అధికారి అయిన బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్తో పాటు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్రావు తదితరులతో పాటు పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లతో సహా 25 మంది ప్రముఖులను ... కేసీఆర్ సమావేశపరిచారు. 2019 ఎన్నికల్లో పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేయటం ద్వారా జగన్ 151 సీట్లు సాధించారు.
ఇప్పుడు జగన్ ను దెబ్బ తీయటానికి ఏకమైన చంద్రబాబు, పవన్ ... వారి ఓట్ బ్యాంక్ కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వారాహి యాత్ర పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల నుంచే ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రావటానికి వీల్లేదని పవన్ పిలుపునిస్తున్నారు. అక్కడ కీలకమైన కాపు ఓట్ బ్యాంక్ తమకు అనుకూలంగా మారుతుందని జనసేన ఆశలు పెట్టుకుంది. అయితే, ముద్రగడకు వైసీపీ వెన్నుదన్నుగా నిలిచినట్లుగా సీన్ కనిపిస్తుండటంతో.. వైసీపీ - జనసేన మద్దతుదారులుగా కాపు ఓటింగ్ లో చీలిక కనిపిస్తోంది.
ఈ క్రమంలో... తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కూడా... కాపు వర్గాల ఓటింగ్ లో చీలిక తెచ్చి... జగన్ కు మేలు చేకూర్చేందుకు హైదరాబాద్ వేదికగా కొత్త స్కెచ్ అమలుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నిర్వహించిన రిటైర్ట్ ఐఏఎస్ ల సమావేశంలో.... బీఆర్ఎస్ బలోపేతం గురించి కాకుండా ఏపీలో కాపు ఓట్లు చీలిపోవాలని.. జగన్కు మేలు చేకూరాలన్న కోణంలోనే ఆయన మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. కాపుల ఓట్లు సంఘటితం కాకూడదని.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ - జనసేన వైపు మొగ్గకూడదని.. వారి ఓట్లు చీలిపోవాలని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. మూడురోజుల కిందట ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల చోటా నాయకులను పిలిపించుకుని మాట్లాడారని... కాపు ఓట్లు ఖచ్చితంగా చీలిపోవాలని స్పష్టీకరించారని తెలుస్తోంది.
ఏపీలో అధికారం దక్కటంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న కాపు ఓటింగ్ పైన చర్చ చేసినట్లు సమాచారం. కాపు ఓటర్ల మద్దతు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి మేలు చేసేందుకే... కేసీఆర్ హైదరాబాద్ వేదికగా అడుగులు వేస్తున్నారని... రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మున్ముందు ఏంజరుగుతుందో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos