లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ మరో కొత్త స్ట్రాటజీ అమలు చేసి ... ఈ సారి కూడా గద్దెనెక్కే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు యూసీసీ అనే కొత్త ఆయుధాన్ని వినియోగించుకోవాలన్ని అన్న అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. యూసీసీ అంటే ఉమ్మడి పౌరస్మృతి అని అర్థం. బీజేపీ ప్రతిసారీ ఎన్నికల ముందు... హిందుత్వ అజెండాను ముందుకు పెట్టి పనిచేస్తుంది కనుక ... దాని ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ అందుకు అనుగుణంగానే ఉంటాయి. అయితే... బీజేపీ ... యూసీసీ అనే నిప్పుతో చెలగాటం ఆడుతోందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి.
ప్రతీ ఎన్నికలకు ముందు ఏదో ఓ అంశాన్ని హైలైట్ చేసి దాంతో హిందూ ఓటర్లను ఆకట్టుకొనేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించడం సాధారణమే అయింది. ఈసారి యూసీసీ బిల్లుని భుజానికెత్తుకుంది. భిన్న మతాలు, భిన్న సంస్కృతీ సంప్రదాయాలు ఉన్న భారత్ లో అందరికీ ఒకే చట్టం పేరుతో ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకురావడమనేది ప్రజాస్వామ్య హక్కులకు, ప్రజాస్వామ్య విలువలకు విఘాతమని ... ఇప్పటికే... లా కమిషన్ కు పంపిన నివేదికలో ముస్లిం లా బోర్డు పేర్కొంది. పర్సనల్ లా ను, మెజారిటీ వాద నైతిక నియంతృత్వం అణచి వేయాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తామని తెలిపింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ఈ ఉమ్మడి పౌర స్మృతిని ఏకగ్రీవంగా వ్యతిరేకించారని వెల్లడించింది.
భారత్ లో ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదని వివరించింది. ఐదేళ్ల క్రితం 21వ లా కమిషన్ కూడా యూసీసీ అవసరం లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. దేశంలో కోట్లాది మంది హిందువులు అనేక కులాలుగా, అనేక పార్టీల మధ్య చీలిపోయి ఉన్నారు. వారందరినీ ఈ బిల్లుతో ఒకవైపు తీసుకురాగలిగితే వారి మద్దతుతో వచ్చే లోక్సభ ఎన్నికలలో ఈజీగా విజయం సాధించవచ్చని బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో నివసించే ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండాలనుకోవడం వినేందుకు బాగానే ఉంది కానీ... అనేక మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు, భిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలు పాటించే ప్రజలందరికీ ఒకటే సూత్రం ఎలా వర్తింపజేయగలరనేది ఆ పార్టీ ఆలోచించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. యూసీసీ బిల్లు పర్యవసనాలు ఎలా ఉంటాయనేది కూడా ఊహకు తట్టడం లేదని అంటున్నారు. పర్యవసానాలు ఎలా ఉన్నా... ప్రజలే భరించాలి తప్ప కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఈ బిల్లుతో కారణంగా బీజేపీ రాజకీయ లబ్ధి పొందగలదనే అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. ఈ బిల్లు కాంగ్రెస్ ... దాని మిత్రపక్షాలను మరింత సంఘటిత పరుస్తుందనే అంచనా కూడా ఉంది.
దేశంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకొంటోంది. ఈ బిల్లుపై కాంగ్రెస్... మిత్రపక్షాలతో కలిసి చిత్తశుద్ధితో పోరాడగలిగితే మంచి రాజకీయ మైలేజీ సాధించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలను, శక్తులను, వివిధ మతాల ప్రజలను ఈ బిల్లు ఏకం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. విచిత్రమేమిటంటే... ఈ విషయం బీజేపీకి కూడా తెలుసు. అయితే... కేవలం హిందూ ఓటర్లనే టార్గెట్ చేసిన కాషాయ పార్టీ ... ఈ బిల్లు కారణంగా దేశవ్యాప్తంగా తక్కువ శాతం మంది ఉన్న మైనారిటీల ఓట్లు కోల్పోతామనే చింతన కూడా ఆ పార్టీ అధిష్టానం అంచనా వేసింది. ఈ బిల్లుతో ... మెజార్టీ శాతాన్ని బీజేపీ వైపు తిప్పుకోగలిగితే చాలు ఎన్నికలలో ఈజీగా గెలిచి మళ్ళీ అధికారంలోకి రాగలమని బీజేపీ యోచిస్తోంది. ఈ రాజకీయ వ్యూహంతో ... లోక్సభ ఎన్నికల్లో ... బీజేపీకి లబ్ధి చేకూరుతుందా ... లేదా అనేది మిలియన్ డాలర్ల క్వొశ్చన్. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos