మణిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన అమానవీయ ఘటన దేశాన్ని కుదిపేస్తున్న క్రమంలో... రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి ఇంటికి కొందరు ఆగంతకులు నిప్పు పెట్టారు. మే 4వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై మణిపూర్ రాష్ట్రప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళల ఊరేగింపు ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ హెచ్చరించారు.
కాగా... ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మణిపూర్కు ప్రతినిధి బృందాన్ని పంపేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇదిలావుండగా... మణిపూర్ లో మెయితీ, కుకీ అనే రెండు తెగల మధ్య దాడులు, ప్రతిదాడుల కారణంగానే ఈ వివాదం తీవ్రతరమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇద్దరు మహిళలను హింసిస్తూ నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ భారతాన్ని కుదిపేస్తున్న క్రమంలో... అసలు వారిపై ఎందుకు ఇంత ఘోరంగా దాడి చేశారనే అంశంపై తీవ్రంగా చర్చజరుగుతోంది.
సుమారు మూడు నెలల కిందట... అంటే ఈ రెండు తెగల మధ్య వివాదాలు, ఘర్షణలు ప్రారంభమైన తొలినాళ్లలో... మే 3న ... మెయితీ తెగకు చెందిన మహిళలపై అత్యాచారం జరిగిందని ఒక్కసారిగా పుకార్లు వ్యాపించాయి. దీంతో రగిలిపోయిన మెయితీ తెగ వారు... ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో మే 4న కుకీ తెగవారి గ్రామంపై దాడికి వెళ్లారు. అదే సమయంలో కుకీ తెగకు చెందిన ఇద్దరు బాధిత మహిళలు ప్రత్యర్థి గ్రూపు కంటపడ్డారని ... దీంతో మెయితీ వర్గం వారు ఆగ్రహంతో ఊగిపోతూ.... కుకీ వర్గానికి చెందిన ఆ ఇద్దరు మహిళలను పట్టుకుని హింసిస్తూ, నగ్నంగా ఊరేగించారని తెలుస్తోంది. వాస్తవంగా... క్రైస్తవ మతాన్ని పాటించే కుకీ వర్గం షెడ్యూల్డ్ తెగల్లో ఉంది. కుకీ ప్రాంతాల్లో మెయితీ వర్గం వారు భూములు కొనే వీలులేదు. గిరిజనులు, గిరిజనేతరులుగా వారు కొనసాగుతున్నారు.
రక్షిత, రిజర్వుడు అటవీ ప్రాంతాలుగా గిరిజనులు నివసించే భూములను ప్రభుత్వం గుర్తించింది. దీంతో తమను షెడ్యూల్ తెగలో చేర్చాలని మెయితీ వర్గం వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో మెయితీ తెగ వారి డిమాండుకు వ్యతిరేకంగా కుకీ తెగ వారు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల వారి మధ్య గొడవలు మొదలై... చివరకు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. ఈ గొడవల నేపథ్యంలో మణిపూర్ లో మే 3 నుంచి ఇంటర్నెట్ ను తాత్కాలికంగా నిషేధించడంతో... మే4న తీసిన మహిళల వీడియో... అప్పటి నుంచి బయటికి రాలేదు. ఇటీవల ఒక్కసారిగా బయటకు వచ్చిన వెంటనే విపరీతంగా వైరల్ అయి అటు భారతావనిని... ఇటు పార్లమెంట్ ను కుదిపేస్తోంది. చివరకు ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్లి ఎక్కడ ముగుస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos