స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను మళ్లీ సోమవారానికి అంటే 9వ తేదీకి వాయిదా పడింది. ఈ సందర్భంగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు తమకు కూడా సమర్పించాలని సీఐడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఇటీవల ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నేడు సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే, ఏఎం సింఘ్వీ వాదలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ వాదించారు. వాదనల సందర్భంగా హైకోర్టు తీర్పులో 17ఏని తప్పుగా అన్వయించారని, చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపించిందని.. హైకోర్టు తీర్పులో మాత్రం చంద్రబాబు ఆదేశాలు అధికార విధుల్లో భాగంగా ఇచ్చినట్లుగా పేర్కొన్నారని హరీశ్ సాల్వే న్యాయస్థానానికి తెలిపారు. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షపూరిత చర్యలో భాగంగా పెట్టినదేనని హరీష్ సాల్వే వాదించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17ఏను తీసుకొచ్చారని చెప్పారు. ఈ కేసు విచారణను 2021 సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభించినట్లు ఏపీ డీజీపీ లెటర్ ను బట్టి తెలుస్తోందని కోర్టుకు తెలిపారు. విచారణ తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని ... 2018లో 17ఏపై చట్ట సవరణ జరిగిందని ... 2018 తర్వాత నమోదైన కేసులన్నింటికీ 17ఏ వర్తిస్తుందని తెలిపారు. నేరం ఎప్పుడు జరిగిందనేది ముఖ్యం కాదని, ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేదే ముఖ్యమని అన్నారు. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు తరఫున మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... యశ్వంత్ సిన్హా కేసులో తీర్పును ప్రస్తావించారు. మరో సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తూ.. ఎఫ్ఐఆర్ తర్వాత ఎఫ్ఐఆర్ ఉందని.. ఇది రాజకీయ కక్షకు సంబంధించిన కేసు అని స్పష్టమవుతోందని.. 73 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన కేసులు విచారిస్తున్నారని... మరో 2 ఎఫ్ఐఆర్లు కూడా వరసగా ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ.. ఎంతమంది సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్నారని ప్రశ్నించగా... ఏపీ ప్రభుత్వం తరఫున హాజరవుతున్న ముకుల్ రోహత్గీతో తాము నలుగురం సరిపోలలేమని సాల్వే వ్యాఖ్యానించారు. కోర్టులో వాదనలు జరుగుతున్నంతసేపు అక్కడి వాతావరణమంతా ఉత్కంఠభరితంగా తయారైంది. ఇరువైపుల లాయర్ల వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 9వతేదీకి విచారణను వాయిదా వేసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos