ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది. ఇప్పటికే అయోధ్య రాముడి విగ్రహం గర్భగుడిలోకి ఏతెంచిన విషయం తెలిసిందే. కర్ణాటక మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహం ఇది. దీని ఎత్తు 51 అంగుళాలు. నల్లరాతిపై శ్రీరామచంద్రుడి నిలువెత్తు విగ్రహాన్ని చెక్కారు. 150 నుంచి 170 కిలోల బరువు ఉంటుంది. 70 సంవత్సరాలుగా రామ జన్మభూమిలో పూజలు అందుకుంటున్న రామ్ లల్లా విగ్రహం గర్భాలయంలోనే ఉంచారు. కాగా రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం.. లడ్డూ ప్రసాదాలను అందజేయనుంది. దీనికోసం లక్ష లడ్డూలను సిద్దం చేసింది. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు. ప్రతి ఒక్కరికీ రెండు లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందిస్తుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్- 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. మొత్తంగా 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు.
ఇదిలావుండగా దేశం నలుమూలల నుంచి వేలాదిమంది ప్రముఖులు చేరుకుంటున్న అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా సెక్యూరిటీ కారిడార్ను ఏర్పాటు చేశారు. ఇక్కడి వాల్మీకీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్ సహా అన్ని ప్రయాణ ప్రాంగణాలపై డేగకన్ను వేశారు. ఈ పరిస్థితుల మధ్య అయోధ్యలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ- టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. అయోధ్యలో వేర్వేరు ప్రాంతాల నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. వేర్పాటువాద సంస్థ ఖలిస్తానీతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos