నేడు తెలుగుభాషా దినోత్సవం. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగు ను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008 లో కన్నడ తో పాటు తెలుగును ప్రాచీన భాష గా గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. మనం ప్రతి యేటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటాం. తెలుగు కవి గిడుగు వేంకట రామమూర్తి జయంతి కూడా ఈ రోజే. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించటానికి.. ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది గిడుగు వేంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని పలువురు భాషాపండితులు ఈ సందర్భంగా అన్నారు. కాగా... తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. గిడుగు వేంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ... ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువచేసిన గిడుగు రామమూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానన్నారు. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన మాతృభాషలోనే ఉండాలని ఆయన ఆశించారు. గిడుగు వారి ఆశయ స్ఫూర్తిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు ... టీడీపీనే నడుం కట్టిందని అన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పాటుపడాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా... మనం కూడా... తెలుగు కవులకు, సాహితీవేత్తలకు, తెలుగు బోధించే ఉపాధ్యాయులకు, తెలుగు మాతృభాష అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకానికి తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు చెబుదామా మరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos