టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ల పైన ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. నేడు జరిగే విచారణ కీలకం కానుంది. ఇప్పటికే మూడోసారి చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ పైన ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లు విచారణలో ఉన్నాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న వాదనలు ఈ రోజు కూడా కొనసాగనున్నాయి. చంద్రబాబు తరపున ప్రమోద్కుమార్ దూబే.. సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబును గురువారం ఏసీబీ కోర్టు జడ్జి ముందు వర్చ్యువల్ గా ప్రవేశ పెట్టి విచారణ చేసిన అనంతరం ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు బెయిల్ పిటిషన్ లో చంద్రబాబు లాయర్ దూబే వాదనలకి ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. కాగా... స్కిల్ స్కామ్లో చంద్రబాబు ప్రధాన సూత్రధారి అనేందుకు పక్కా ఆధారాలున్నాయని ... ఆర్ధిక శాఖ అభ్యంతరాలను పట్టించుకోకుండా 13 చోట్ల సంతకాలు చంద్రబాబు చేశారని ఆయన కోర్టుకు వెల్లడించారు. రూ.370 కోట్ల నిధుల విడుదలపై అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత అభ్యంతరాలతో కూడిన నోట్ ఫైల్ కోర్టుకు సమర్పించారు. టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్లు జమ అయ్యాయని బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని నేడు పొన్నవోలు తన వాదనలు వినిపించనున్నారు. ఆ తర్వాతే సీఐడీ కస్టడీ పిటిషన్పై పొన్నవోలు వాదనలు కొనసాగనున్నాయి. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని, కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుందని కోరారు. మొత్తానికి... అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ ఈ నెల 9న జరగనున్న క్రమంలో.. ఇటు హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్ల పైన విచారణ పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో ఈ రోజు ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్.. కస్టడీ పైన ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos