నిన్నమొన్నటివరకు సామాన్య ప్రజానీకానికి సైతం అందుబాటులో ఉన్న టమోటా ... ఇప్పుడు అందనంత ఎత్తుకు ఎదిగిపోయిందని అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా టమోటా ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొంతమంది రైతులను కోటీశ్వరులను చేస్తున్న ఈ టమోటా రేటు ... ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుందనుకుంటే... మరోసారి ధర అమాంతం పెరిగిపోయి... కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన కారణంగా టమోటా ధర హైదరాబాద్ నగరంలో ఒకేసారి భారీగా పెరిగిపోయింది. మొన్నటి వరకు 160 నుంచి 180 వరకు ఉన్న టమోటా ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది. అంతటితో ఆగుతుందా అంటే.. సమస్యే లేదు.. ఈ వర్షాల వల్ల గణనీయంగా పంటలు దెబ్బతినటంతో.. మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు వ్యవసాయ విశ్లేషకులు. దీంతో నగరవాసులు అసలు టమోటా ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా విక్రయాల పరిమాణం కూడా బాగా తగ్గిపోయింది. మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో అక్కడి నుంచి కూడా టమోటాల దిగుబడి కొరత ఏర్పడింది. ఇప్పుడు, హైదరాబాద్ , తెలంగాణలోని ఇతర జిల్లాలలో టమోటాలు పంజాబ్ నుండి దిగుమతి అవుతున్నాయి. ఓవైపు... టమోటా ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతుంటే... మరోవైపు దొంగల ఆగడాలతో రైతులు కూడా ఇబ్బందులపాలు అవుతున్నారు. ఆమధ్య టమోటా లోడుల దొంగతనాలు, దోపిడీలు జరిగిన క్రమంలో ... రీసెంట్ గా కర్ణాటకలో మరో దొంగతనం వెలుగుచూసింది. కోలార్ ఏపీఎంసీ యార్డ్ నుండి రాజస్థాన్లోని జైపూర్కు రూ.20 లక్షల విలువైన టమాటా లోడ్తో వెళుతున్న ట్రక్ కనిపించకుండా పోయింది. ఈ మేరకు ట్రక్కు యజమానులు కోలార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ట్రక్కు శనివారం రాత్రి జైపూర్ చేరుకోవాల్సినప్పటికీ, అక్కడకు వెళ్లలేదు. డ్రైవర్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... కోలార్లో ఉన్న ఎస్వీటీ ట్రేడర్స్ యజమాని మునిరెడ్డి దుకాణం నుండి 11 టన్నుల టమాటా లోడుతో ట్రక్కు జైపూర్కు బయలుదేరింది. శనివారం రాత్రి లారీ మధ్యప్రదేశ్లోని భోపాల్ టోల్ గేట్ దాటినట్లు మునిరెడ్డికి డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. ఆదివారం ఉదయం ట్రక్కు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఫోన్ చేయగా, నెంబర్ అందుబాటులో లేదని వచ్చింది. ట్రక్కు క్లీనర్ వద్ద మొబైల్ ఫోన్ లేదు. లారీకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లొకేషన్ నుండి కూడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో మునిరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. ట్రక్కు కోలార్ నుండి సుమారు 1,600 కి.మీ దూరం ప్రయాణించిన తర్వాత జాడ లేకుండా పోయింది. సో... ధరలు పెరిగి సామాన్యులు... టమోటాలను దొంగల నుంచి కాపాడుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos