ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అక్కడి ప్రధాన పార్టీలన్నింటిలోనూ గందరగోళం నెలకొంది. ఒకవైపు టీడీపీ-జనసేన సీట్ల షేరింగ్ పై క్లారిటీ వచ్చినట్లే వచ్చి మళ్లీ ఆ విషయం పెండింగ్ పడి మొదటికొచ్చినట్లయింది. బీజేపీ కూడా పొత్తులో భాగస్వామ్యం అయ్యేందుకు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు రావడంతో... పార్లమెంట్ సమావేశాల అనంతరం జనసేనాని పవన్ ఢిల్లీ వెళ్లి ఆ సంగతేదో తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీలో ఈసారి టికెట్ దక్కని ఎమ్మెల్యేలు బయటికి పోతామని చెబుతూనే మళ్లీ మనసు మార్చుకున్న ఉదంతాలు బయట పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇష్యూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. వైసీపీలో అతి కొద్ది కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఒకరు. ఆయన కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. తన సామాజిక వర్గానికే చెందిన చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేయమని అధిష్టానం పలుమార్లు సూచించినా ఆయన అలా చేయలేదు. దీంతో వసంతను పార్టీ అనుమానించడం మొదలుపెట్టింది. దీన్ని అవమానంగా భావించిన వసంత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయన అనుచరులతో భేటీ అయి రాజీనామా ప్రకటన చేయాలని నిర్ణయించి... ఈ మేరకు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో ఏమైందో ఏమో కానీ ప్రెస్ మీట్ పెట్టినా రాజీనామా ప్రకటన తప్ప మిగతా అన్ని విమర్శలనూ చేసేశారు. ప్రజలకు సేవ చేయలేనప్పుడు తానెందుకు ఎమ్మెల్యేగా ఉండాలని... వైసీపీ అధిష్టానికి కక్షసాధింపులు వద్దని, వైఎస్ లా పాలించాలంటూ హితవు పలికారు. చంద్రబాబు, లోకేష్ ను తిట్టని నిన్ను ఎలా నమ్మాలని స్వయంగా జగనే ప్రశ్నించారన్నారు. విపక్ష నేతల్ని తిట్టని వాళ్లకు టికెట్లు ఇవ్వనని చెప్పేశారన్నారు. మనసు గాయపడినప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేం కదా అని అన్నారు. అయితే పెద్దిరెడ్డి కాల్ చేసి తొందర పడొద్దని చెప్పారని... రాజకీయాలు వదిలేసి వ్యాపారాలు చేసుకుందామని అనుకున్నానని, కానీ శ్రేయోభిలాషులు రాజకీయాల్లోనే ఉండమంటున్నారన్నారు. దీంతో తాను త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తానన్నారు. దీంతో వైసీపీలో అసలేం జరుగుతోందని ఇప్పుడు అందరిలోనూ చర్చ జరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos