ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అన్ని పార్టీలు యాక్టివ్ అవుతున్న వేళ జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం ఇంకా స్పీడ్ పెంచడం లేదని... ఆ పార్టీ పెద్దలకు ... ఎన్నికల నాటికి ఏం చేయాలనే స్పష్టత లేదనే ప్రచారం నడుస్తోంది. దీంతో ఆ పార్టీ అధిష్టానం అలర్టు అయి... ఇలాంటి దుష్ప్రచారాన్ని కట్టడి చేసి శ్రేణులను సమాయత్తం చేసేలా కార్యా చరణను సిద్ధం చేయబోతోందని టాక్. పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంతో సంబంధం లేకండా ఎలా ప్రజల్లోకి వెళ్లాలి.. ఎలాంటి అంశాలు లేవనెత్తాలనే విషయాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. పొత్తు ఉన్నా లేకపోయినా అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో మరింత బలపడేలా ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ పెద్దలు. జనసేనతో పొత్తు ఉన్నట్టు ప్రకటిస్తున్నా ఆ పార్టీ నుంచి మాత్రం అంత సానుకూలత లేదని టాక్. అందుకే పొత్తుల ఎత్తులను పట్టించుకోకుండా ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పొత్తులపై స్పష్టత లేకపోయినా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నవారి జాబితా మాత్రం అధినాయకత్వానికి చేరింది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర నాయకులు జిల్లాల్లో పర్యటించి ఆశావహుల లిస్ట్ రెడీ చేశారు. రాష్ట్ర స్థాయిలో వడపోత తర్వాత ఫిల్టర్ చేసిన జాబితాను ఢిల్లీ పంపించారు. దీనిపై అక్కడ మరోసారి కసరత్తు పూర్తి చేసి పోటీదారులను ప్రకటిస్తారు. ఆయితే పొత్తులపై కూడా సీరియస్గానే దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య కేంద్ర మంత్రి శివప్రకాశ్ విజయవాడలో నేతలతో సమావేశమయ్యారు. పొత్తులపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. వాటిని షీల్డ్ కవర్లో జాతీయ నాయకత్వానికి చేరవేశారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో సమావేశమై అధినాయకత్వం ఓ నిర్ణయానికి రానుంది. మరోవైపు క్లస్టర్ వారీగా జాతీయ నేతలు ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా జేపీ నడ్డా వస్తారు. అనంతరం హోంమంత్రి అమిత్షా రానున్నారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తారు. ముగ్గురు కూడా వేర్వేరు తేదీల్లో వేర్వేరు క్లస్టర్స్ సమావేశాల్లో పాల్గొంటారు. ఒకట్రెండు రోజుల్లో ఈ పర్యటనలు ఖరారు కానున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos