రాష్ట్రంలో రాబోయే మూడు నెలల్లో రైతురాజ్యం వస్తుందనీ... అమరావతే రాజధానిగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పొరుగున ఉన్న హైదరాబాద్ వెలిగిపోతుంటే, అమరావతి మాత్రం వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే ఆదాయం సమకూరుతుందని.. ఉపాధి కల్పన ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 'రా.. కదలిరా..' పేరుతో చంద్రబాబు జిల్లాకో బహిరంగ సభ జరిగింది. ఇందులో భాగంగా ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో, సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. తొలుత ఉదయం తిరువూరు సభ లో మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని ఏదని అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని జగన్ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. మూడు రాజధానుల పేరుతో విశాఖకు వెళ్లడానికి ప్రయత్నిస్తే ఎక్కడికీ వెళ్లొద్దని కోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. అధికారంలో నుంచి సైకో పోవాలన్నది తన కోరిక కాదని, అది ప్రజల కోరికని చెప్పారు. జగన్ రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీశాడని ధ్వజమెత్తారు. 'రా.. కదలిరా..' కార్యక్రమం తన కోసమో, పవన్ కోసమో, లోకేశ్ కోసమో కాదని.. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల కోసమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి కారణంగా 5 కోట్ల మంది జనాభా ఒక తరాన్ని నష్టపోవడం దేశంలో ఎక్కడా జరగలేదని అన్నారు. అనంతరం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన సభ లో మాట్లాడుతూ సీఎం జగన్ కు చంద్రబాబు ఒక సవాల్ విసిరారు. జగన్ కు దమ్ముంటే నేను చెప్పిన ఎమ్మెల్యేలను మార్చగలరా అని ఛాలెంజ్ చేశారు. ఆచంట, తణుకు, తాడేపల్లి, భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలను మార్చే ధైర్యం నీకు ఉందా జగన్ అని ఛాలెంజ్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos