ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా టీడీపీ – జనసేన పొత్తులు కొనసాగుతున్న క్రమంలో... ఆ రెండు పార్టీలతో తాను కూడా కలవాలా వద్దా అనే సంశయంలో ఉన్న బీజేపీ ఇప్పుడు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ ప్రధాన లక్ష్యం గోల్ ఫిక్స్ చేసుకున్న క్రమంలో కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ – జనసేన పొత్తుతో తాను కలిసి నడవాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఢిల్లీ నేతల నుంచి పొత్తు పైన తాజా సంకేతాలు అందుతున్నాయి. వారు కొన్ని షరతులు పెడుతున్నారు. ఈ సమీకరణల ప్రకారం 2014 తరహా పొత్తులు మరోసారి తెర పైకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన ... తమ రెండు పార్టీలతో ఏపీలో కలిసి రావాలంటూ పవన్ కళ్యాణ్ ఇదివరకే బీజేపీకి ప్రతిపాదించారు. ఇప్పటివరకు బీజేపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో... సంక్రాంతి వరకు వేచి చూసి తమ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు - పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఏపీలో పొత్తుల పైన బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తుల పైన క్షేత్ర స్థాయి సమాచారంతో నివేదిక ఇవ్వాలని బాధ్యతలను హైకమాండ్ బీజేపీ జాతీయ నేతలకు అప్పగించగా... బీజేపీ, జనసేనతో కలిసి వెళ్లాలని కొందరు సూచించగా.. తెలంగాణ తరహాలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ సొంతంగా ఎదిగేలా వ్యూహం ఉండాలని మరికొందరు సూచించారు. ఏపీ నుంచి అసెంబ్లీ, లోక్ సభలో పార్టీకి ప్రాతినిధ్యం దక్కాలంటే పొత్తులు అవసరమని ఇంకొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో.. ప్రాథమికంగా జరిగిన చర్చల్లో పొత్తులో భాగంగా తమకు దక్కే సీట్ల గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 8 లోక్ సభ, 12 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ నుంచి టీడీపీకి ప్రతిపాదన అందిందని చెబుతున్నారు. సీట్ల పైన ఒప్పందం కుదిరితే ... పొత్తు విషయంలో ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఏపీ విషయంలో.. చంద్రబాబు, జగన్ తో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేది ప్రధాని నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో తాజా ఎన్నికల్లో సొంతంగా వెళ్లటం ద్వారా సీట్లు, ఓట్లు పెరిగిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. జనవరి తొలి వారంలో పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో పొత్తుల పైన బీజేపీ వైఖరి ఏంటనేదానిపై స్పష్టత రానుంది. సంక్రాంతికి బీజేపీ నుంచి సానుకూల స్పందన వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos