ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని ప్రధాన పార్టీల నేతలు బిజీబిజీగా మారిపోయారు. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ... ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ నేతల స్థానాల మార్పులు చేర్పుల కార్యక్రమంలో తలమునకలై ఉండగా... టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జిల్లాల పర్యటనల్లో హడావుడిగా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఈ రోజు తొలుత బెంగళూరుకు చేరుకొని, అక్కడ టీడీపీ ఫోరం నేతలతో సమావేశం అవుతారు. చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు కర్ణాటకలోని టీడీపీ నేతలతోపాటు బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఆయనకు మద్దతుగా ఆందోళనలు చేశారు. ఇందుకు వారిని స్వయంగా కలిసి కృతజ్ణతలు తెలిపేందుకు చంద్రబాబు బెంగళూరులో వారితో సమావేశం అవుతారు. ఈ కార్యక్రమం తరువాత... ఆయన రోడ్డు మార్గంలో ఈ రోజు సాయంత్రం చిత్తూరు జిల్లాలోని గుడుపల్లి గ్రామానికి చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ వర్గాలతో సమావేశం అవుతారని సమాచారం. చంద్రబాబు రేపు, ఎల్లుండి కూడా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. మరోవైపు ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా జనవరి 5వ తేదీ నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ రోజు తణుకులో జరిగే సభతో చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభమవుతుంది. జనవరి 11న నరసరావుపేటలో పవన్తో కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తారు. చివరలో అనంతపురం జిల్లాలో కూడా ఉమ్మడి సభ నిర్వహించాలని ఆలోచనలో ఉన్నారు. రోజుకు రెండు సభలను నిర్వహించి జనవరి చివరినాటికి పూర్తి చేయాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇదిలావుండగా... ఈసారి ఎన్నికల్లో ప్రముఖుల కుటుంబాలకు కేవలం ఒక్క సీటు మాత్రమే ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి ఒక సీటు మాత్రమే ఇచ్చే అవకాశముంది. అయితే... దివంగత నేత యర్రన్నాయుడు కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కుటుంబాలకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉన్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos