ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రచారపిచ్చి పీక్స్ కు చేరింది. ఇప్పటికే ఆయనకు వస్తున్న ప్రచారం సరిపోలేదో ఏమో... ఆ యావ కాస్త మరింతగా ముదిరింది. ఇందుకు సంబంధించిన అంశంపైనే ఇప్పుడు తిరుపతిలో రాజకీయాలు వేడెక్కాయి. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై కూడా స్థానిక అధికారులు అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి ఫొటో ముద్రించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇళ్ల పట్టాలపై జగన్ ఫొటో ఉండటాన్ని టీడీపీ, జనసేన పార్టీ నేతలు నిరసనలు వ్యక్తం చేసేందుకు సిద్ధపడటంతో తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ సుగుణమ్మను.. జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే తిరుపతిలో మరికొందరు నేతలకు ముందుగానే నోటీసులు కూడా జారీ చేశారు. ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదన్నారు. సుగుణమ్మ ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. గతంలో అనేకసార్లు ఉద్యోగులకు ఇంటి పట్టాలు ఇచ్చిన టీటీడీ... ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ నేతల ఫొటోలు పట్టాలపై ప్రచురించలేదు. ఇళ్ల స్థలాలను టీటీడీ ఉద్యోగులు డబ్బులు చెల్లించి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డబ్బులు కట్టి తీసుకుంటున్న పట్టాలపై టీటీడీ లోగో మాత్రమే ఉండాలి తప్ప జగన్ ఫొటో ఎందుకు అని టీటీడీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు తమ రాజకీయ లబ్ధి కోసం టీటీడీని కూడా వదలడం లేదని టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాలను సొసైటీ ద్వారా కేటాయించాల్సి ఉన్నా... తామే ముఖ్యమంత్రి జగన్ను ఒప్పించి టీటీడీ తరఫున నేరుగా ఇప్పిస్తున్నామని నమ్మించేందుకు ఇలా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సీఎం ఫొటో చుట్టూ ప్రభుత్వం ‘నవరత్నాలు’ పేరుతో అందిస్తున్న పథకాలను సైతం ముద్రించడంపై మండిపడుతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని ... పట్టాలపై ముద్రించిన జగన్ ఫొటో, నవరత్నాల ప్రచారాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాగే వదిలిస్తే జగన్ అన్న సుప్రభాత సేవ, జగన్ అన్న తోమాలసేవ అంటారని ఎద్దేవా చేశారు. మరోసారి అధికారంలోకి వస్తే వేంకటేశ్వరస్వామి ఫొటో తీసి జగన్ ఫొటో పెడతారేమోనని సెటైర్లు వేశారు. ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ ఫొటో వివాదంపై టీటీడీ స్పందించాల్సి ఉంది. మొత్తానికి ఇప్పుడు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos