వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నాలుగు జాబితాలను రిలీజ్ చేసిన జగన్...ఐదో జాబితాపై కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా తాడేపల్లి కి ఎమ్మెల్యేలను పిలుపించుకొని మాట్లాడుతున్నారు. టికెట్ ఇవ్వని నేతలకు సర్దిచెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఇవ్వడం లేదో వివరిస్తున్నారు. పార్టీ కోసం పని చేయాలని, భవిష్యత్ లో మంచి అవకాశాలు కల్పిస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. జగన్ ... పార్టీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్ నుంచి రహస్య రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న, ప్రజలకు అందుబాటులో ఉండని నేతలపై వేటు వేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పని తీరును సీఎం జగన్ పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన సీఎం జగన్...త్వరలో ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులను పిలిపించి మాట్లాడుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వాస్తవ పరిస్థితులను సదరు నేతలకు వివరించారు. మరోవైపు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు క్రిష్ణదేవరాయలును మార్చే అవకాశం ఉందని అంటున్నారు. వీటితోపాటు పలు పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఎంపీ లావు క్రిష్ణదేవరాయులు...సిట్టింగ్ స్థానం నర్సరావుపేట పార్లమెంట్ ను కోరుకుంటున్నారు. అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం గుంటూరుకు పంపించాలని భావిస్తోంది. దీనికి ఆయన అంగీకరించడం లేదు. నర్సరావుపేట పార్లమెంట్ నియోజవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి కూడా లావును బరిలోకి దించాలని సీఎం జగన్ కు చెప్పారు. నంద్యాల ఎంపీ సీటులో పోచ బ్రహ్మానందరెడ్డికి బదులుగా ముస్లిం అభ్యర్ధిని బరిలోకి దించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇక్కడ ముస్లిం సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో...తమకు కలిసి వస్తుందని జగన్ లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ నటుడు అలీ లేదా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఖాదర్ బాషాకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. రేపు లేదా ఎల్లుండి ఐదో జాబితా వెలువడే అవకాశముంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos