ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్వాడీల ప్రతినిధులు తెలిపారు. జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని.. తక్షణం విధుల్లోకి వెళ్తామని చెప్పారు. జనవరి 24న ఏపీ బంద్కు అంగన్వాడీలు పిలుపునివ్వడంతో ఏపీ సర్కారు మరోసారి వారిని చర్చలకు పిలిచిన క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలు, సమస్యలను వారు మంత్రి దృష్టికి తెచ్చారు. యథావిధిగా విధులకు హాజరుకావాలని అంగన్వాడీ సంఘాలకు మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని.. మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. దీంతో మంగళవారం నుంచి అంగన్వాడీలు యథావిథిగా విధులను కొనసాగిస్తున్నారు. అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్ను రూ.1.20 లక్షలకు, హెల్పర్కు రిటైర్మెంట్ బెనిఫిట్ను రూ.60 వేలకు పెంచామని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. సమ్మె కాలంపై ఏం చేయాలనే దానిపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని బొత్స తెలిపారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లుగా నిర్ణయించామని, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా మార్చనున్నామని చెప్పారు. ఇప్పటికే చాలా డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇచ్చామని, మిగిలిన వాటిపట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. తమ ముందు 11 డిమాండ్లు పెట్టగా వాటిలో పదింటిని నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు. సమ్మె విరమించిన అంగన్వాడీలకు బొత్స ధన్యవాదాలు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos