ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో టీడీపీ నుంచి టిక్కెట్ల కోసం ఆశావహులు, అసంతృప్తులు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలుస్తున్నారు. తొలి జాబితాలో పేరు లేని వారు రెండో జాబితాలోనైనా తమకు టిక్కెట్ కేటాయించాలని అధిష్టానానికి విన్నవిస్తున్నారు. వైసీపీలో టికెట్ దక్కని నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. తాజాగా, వైసీపీ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కీలక స్థానాల్లో టికెట్ ఆశించి.. భంగపడ్డ నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. కొందరిని వేరే చోటు నుంచి.. మరికొందరిని ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు వెళ్లి కలిశారు. సర్వేపల్లి టికెట్ పై సోమిరెడ్డి ఆయనతో చర్చించారు. పలాస టికెట్ ను గౌతు శిరీష ఆశిస్తుండగా.. పెందుర్తి స్థానాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు. అలాగే, ఎచ్చెర్ల టికెట్ ను కళా వెంకట్రావు ఆశిస్తున్నారు. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆయా స్థానాల్లో స్పష్టత కోసం వారు చంద్రబాబుతో సమాలోచనలు జరిపారు. మరోవైపు చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతతో నెరవేరుస్తానని గుమ్మనూరు జయరాం అన్నారు. చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని... గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. కాగా త్వరలోనే రెండో జాబితా విడుదల కానున్న నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో టికెట్లు ఎవరికి దక్కుతాయోనని టీడీపీ నేతల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos