ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ భారీ షాక్ తగలబోతోంది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న చింతా అనురాధ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఈ మేరకు ఆమె భర్త టిఎస్ఎన్ మూర్తి... బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. ఆయనకు పి.గన్నవరం టికెట్ హామీ లభించడంతో బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. పైగా రానున్న ఎన్నికల్లో చింత అనురాధకు ఎంపీ టికెట్ ఇవ్వలేకపోగా ఆమె స్థానే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలుస్తోంది. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా మంత్రి విశ్వరూప్ తో ఆమెకు విభేదాలు ఉన్నాయి. సయోధ్య కుదిరేలా పంచాయితీలు నడిచినా పెద్దగా ఊరట లభించలేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తులో భాగంగా బిజేపీకి పది అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. బీజేపీ హై కమాండ్ సైతం గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఎంపీ భర్త టిఎస్ఎన్ మూర్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా పి.గన్నవరం అసెంబ్లీ సీటు బీజేపీకి దక్కితే అక్కడ నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు ఆ స్థానం టిడిపి పరిధిలో ఉంది. మహాసేన రాజేష్ కు చంద్రబాబు ఆ స్థానాన్ని కేటాయించటంతో టిడిపి, జనసేన శ్రేణుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మూర్తి ... పురందేశ్వరిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లోనే తాను పోటీ చేయాలని భావించానని, కానీ తాను కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉండటంతో కోటి చేసేందుకు కుదరలేదని మూర్తి చెబుతున్నారు. ప్రస్తుతం తాను పదవీవిరమణ చేయటంతో క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నందున పోటీకి సిద్దంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos