ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారవేళ ... ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన ఎన్నో హామీల్లో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కార హామీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తాను అధికారంలోకి రాగానే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తానని ... ప్రతి సంవత్సరం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులకు ఆశ కల్పించారు. జగన్  మాటలను నమ్మిన నిరుద్యోగులు వైసీపీకి ఓట్లు వేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. కానీ జగన్  అధికారంలోకి వచ్చిన తరువాత జాబ్ క్యాలెండర్ల మాట విస్మరించి నిరుద్యోగుల గోడు పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. పర్యవసానంగా ఇప్పుడు నిరుద్యోగం విషయంలో మన రాష్ట్రానికి అగ్రస్థానం దక్కింది. గ్రాడ్యుయేట్లలో 21 శాతం నిరుద్యోగ రేటుతో దేశంలో మనరాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగిత జాతీయ సగటు కంటే 11 శాతం అధికంగా ఉంది. వెనుకబడిన బిహార్ రాష్ట్రం కూడా ఈ విషయంలో ఏపీ కంటే మెరుగ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ఈ గణాంకాలను వెల్లడించింది. జులై 2022 నుంచి జూన్ 2023 వరకు నిర్వహించిన సర్వే వివరాలు తాజాగా విడుదలయ్యాయి. డిగ్రీ చదువు కున్న వారిలో నిరుద్యోగిత రేటు ఏపీలో 24 శాతం... ఉండగా జాతీయ సరాసరి 13.4 శాతం ఉంది. తెలంగాణ 9వ స్థానంలో.. తమిళనాడు 10వ స్థానంలో నిలిచాయి. కర్ణాటక రాష్ట్రంలో జాతీయ సగటు కంటే తక్కువగా 9.4 శాతమే నిరుద్యోగిత ఉంది. మనరాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాలకు పెద్దపేట వేస్తానని మాటలతో కోటలు కట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల్ని తరిమేసి యువత భవితతో ఆడుకుంటున్నారనడానికి నిరుద్యోగితే నిదర్శనం. యువతకు నైపుణ్యాలు దూరం చేసి, నిరుద్యోగులను తయారు చేయడంలో జగన్ సర్కారు పోటీ పడుతోంది. ఇక మహిళల విషయానికొస్తే... గ్రాడ్యుయేషన్ చేసిన మహిళల్లో 34.6 శాతం నిరు ద్యోగిత ఉండగా.. పురుషుల్లో 20.3 శాతం ఉంది. మహిళల జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు 20.6 శాతం కంటే ఏపీలో 14 శాతం అధికంగా ఉంది. పురుషుల్లో జాతీయ సగటు 11.2 శాతం కాగా ... రాష్ట్రంలో నిరుద్యోగిత 9 శాతం ఎక్కువగా ఉంది. మరోవైపు రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగం అధికంగా ఉందని  అన్ని సర్వేల నివేదికలు బహిర్గతం చేస్తున్నాయి. పట్టభద్రుల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ - సీఎంఐఈ గతేడాది విడుదల చేసిన వినియోగదారుల పిరమిడ్ల గృహ సర్వేలోనూ బహిర్గతమైంది. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలోని నిరక్షరాస్యుల్లో ఉపాధి లేనివారు 2.03 శాతంగా ఉంటే పట్టభద్రుల్లో 35.14 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. నైపుణ్య శిక్షణను అటకెక్కించి.. యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అంటూ నాలుగున్నరేళ్లపాటు మాటలు చెప్పిన సీఎం జగన్ ఇంతవరకు నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయలేదు. ఇంజినీరింగ్ వారికి విశాఖపట్నంలో హైఎండ్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పి దానినీ అటకెక్కించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కక్ష సాధింపు కోసం సీమెన్స్ లాంటి నైపుణ్య కేంద్రాలను మూసేసి యువతకు నైపుణ్యాన్ని దూరం చేశారు. శిక్షణ, పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగిత పెరుగుతోంది. ఏటా డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతరత్రా కోర్సులు పూర్తి చేస్తున్న వారు 2.30 లక్షల మంది బయటకు వస్తున్నా తగినంతగా నైపుణ్య శిక్షణ దొరకడం లేదు. జగన్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు శిక్షణ కోసం రూ. వేలల్లో ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. ఏపీ రాష్ట్రంలో ఉద్యోగం, ఉపాధి అంటే పొరుగుసేవల ఉద్యోగం, లేదంటే చిన్నచిన్న పనులే చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెద్ద నగరమంటూ లేదు. సాఫ్ట్ వేర్ కంపెనీలు, పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరిగా లేవు. చాలామంది వలస వెళ్లిపోతుండడంతో ఇక్కడ సంపాదించే యువత సంఖ్య తగ్గిపోతోంది. బీటెక్, సాధారణ డిగ్రీ చదివిన వారికి తగిన ఉద్యోగాలు రాకపోవడంతో ఆన్ లైన్ కోర్సులు, అదనపు అర్హతలు పెంచుకునేందుకు భారీగా వ్యయం చేస్తున్నారు. ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు. కొత్తవి రాకపోగా.. ఉన్నవే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. విశాఖపట్నం, విజయవాడతో సహా రాష్ట్రంలో పెద్ద ప్యాకేజీ లతో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ నియామ కాలకు సాఫ్ట్ వేర్ కంపెనీలు రావడం లేదు. ఈసారి బీటెక్ వారికి లభించే ఉద్యోగాలు భారీగా తగ్గిపోయాయి. సాధారణ డిగ్రీ చదువుకున్న వారి పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. నిరుద్యోగులను పట్టించుకోకుండా... వారికిచ్చిన హామీని విస్మరించి .. నిరుద్యోగం విషయంలో దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలిపినందుకు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలా అని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

Related Videos