ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి - బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ నుంచి ఇప్పటికి బయటికి వెళ్లిపోయిన వారే కాకుండా ఇంకా పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డికి టచ్ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా... బీఆర్ఎస్ సీనియర్ నేత, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని ఆ పార్టీకి షాకిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ లో ఈసారి సిట్టింగ్ లకు టికెట్ దక్కడం కష్టమేనని ప్రచారం జరగడంతో పాటు పార్టీ అధిష్ఠానం కొంతకాలంగా తనను దూరం పెట్టడంతో వెంకటేశ్ నేతకాని పార్టీ మారినట్లు తెలుస్తోంది. జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత గతంలో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంకటేశ్... తొలుత కాంగ్రెస్ లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ మరుసటి ఏడాది అనూహ్యంగా బీఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎంపీ వెంకటేష్ నేతకాని కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos