కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయింది. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహించారు. వేదమంత్రోఛ్చారణల మధ్య ఈ ఘట్టం పూర్తైంది. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన స్క్రీన్స్లో ప్రాణ ప్రతిష్ఠ తంతును ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ఐదుగురికి మాత్రమే ప్రవేశం కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ అనందీబెన్ పాటిల్, ప్రధాన అర్చకుడు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రామాలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ స్వామి వారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. స్వామి వారి పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. మరోవైపు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభర ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరు చాలా భావోద్వేగానికి గురై ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చారు. కాగా అయోధ్యలో మహోత్సవం సంధర్భంగా అన్ని వీధులూ కాషాయంతో నిండిపోయాయి. జైశ్రీరామ్ పేరిట పెద్ద ఎత్తున జెండాలు వెలిశాయి. కొన్ని చోట్ల రాముడి హోర్డింగ్లు, ఫ్లెక్సీలు కట్టారు. ఇదిలా ఉండగా... బాల రాముడి ప్రాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా ఒక అనీర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ఈరోజు యావత్ దేశ రామ నామ స్మరణతో మారుమోగింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos