తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన నివాసంలో కలవడం సంచలనం కలిగించింది. మర్యాదపూర్వకంగా కలిశామని... నియోజకవర్గ సమస్యలపై... ప్రోటోకాల్ విషయమై చర్చించేందుకు భేటీ అయ్యామని వారు చెబుతున్నా... వారి మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు. దీని వెనుక రాజకీయ కోణం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంను కలిసినవారిలో ఉన్నారు. కొత్త ప్రభాకర్ అపాయింట్మెంట్ తీసుకోగా, మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి, ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద గన్మెన్ల అంశాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరుపుతోంది. అక్రమాలు తేలితే బీఆర్ఎస్ బడా నేతలు జైలుకే అంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుండగా... ఇదే సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరనీ... కాంగ్రెస్ పార్టీలోకి 30 మంది ఎమ్మెల్యేలు వస్తారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్ సిట్టింగ్ జడ్జి విచారణ అనంతరం కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లేది ఖాయమని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లో చేరతారంటూ గులాబీ పార్టీ నేతలు చెబుతుండటం రాజకీయంగా చర్చకు దారిస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోందని ... డేంజర్ బెల్స్ మోగుతున్నాయని ఐది ఆ పార్టీ మనుగడకు ఇబ్బందికరమే నని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos