ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగా అన్నివర్గాల వారే కాకుండా... అన్నిశాఖల ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో... దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లోనూ సమ్మెలో పాల్గొన్నారు. కలెక్టరేట్లు, సబ్ కలెక్టరేట్లు, ఐసీడీఎస్ కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్లు ఆందోళనలో పాల్గొన్నారు. కనీస జీతం 26 వేల రూపాయలు ఇవ్వాలని, టీఏ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలుచేయాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని, అన్నికేంద్రాల్లోనూ కనీస సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేతగా పాదయాత్రలో మహిళలకు అండగా నేనున్నా అని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని... మహిళలకు అండగా ఉండటమంటే ఇదేనా జగనన్నా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా మొదటిరోజు మంగళవారం జిల్లా ప్రాజెక్టు కార్యాలయాలు, సీడీపీవో కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. సమ్మె నేపథ్యంలో అంగన్ వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ఇదిలావుండగా... అంగన్ వాడీ కార్యకర్తలు సమ్మె విరమించకపోతే విధులకు గైర్హాజరైనట్లుగా భావించి కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల పట్ల కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. వారి ఉద్యోగ విరమణకు గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయించినట్లు వివరించింది. కార్యకర్తలకు ఇచ్చే ఉద్యోగ విరమణ ప్రయోజనాన్ని రూ.50 వేల నుంచి రూ. లక్షకు ... ఆయాలకు రూ. 20 వేల నుంచి రూ. 40 వేలకు పెంచాలని, పదోన్నతుల గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకరించినటు పేర్కొంది. టీఏ, డీఏల విడుదలకు నిర్ణయించామని వెల్లడించింది. మంగళవారం సాయంత్రం అంగన్ వాడీలకు చెందిన ప్రధాన సంఘాలతో చర్చలు జరిపి వేతనాలు పెంచేదే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా... అంగన్ వాడీల సమస్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. జగన్ ప్రభుత్వం వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటూ ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ఆందోళన చేస్తే లాఠీ ఛార్జి చేయిస్తూ, ప్రశ్నించిన వారిని మెమోలతో బెదిరిస్తూ జగన్ అరాచక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రమేమైనా నీ తాత జాగీరా జగన్.. అంగన్ వాడీలు నీకు శాశ్వతంగా మెమో ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. గతంలో అంగన్ వాడీల జీతం రూ.4,200 ఉండగా టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు ఆ మొత్తాన్ని రూ.10,500 లకు పెంచారని గుర్తుచేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే మరోమారు వారి జీతాలు పెంచుతామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అంగన్ వాడీలకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos