పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా ... అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తూ బ్లాక్ బోర్డుపై వారి అనుమానాలు తీరుస్తూ విద్య నేర్పించేవారు. ఇలాంటి ప్రత్యక్ష బోధనపై విద్యార్థులందరూ ఆసక్తి చూపేవారు. దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఆన్ లైన్ బోధన కంటే ఉపాధ్యాయుడి సమక్షంలో అభ్యసనే సరైన విధానమని... బోధనలో సాంకేతిక పరికరాలు తెచ్చే దుష్ప్రభావాలపై తస్మాత్ జాగ్రత్త అంటూ ఐక్యరాజ్య సమితి విద్యానుబంధ సంస్థ యునిసెఫ్ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో యూనిసెఫ్ సూచనలకు అనుగుణంగా అనేక దేశాలు ఆన్ లైన్ నుంచి పిల్లల్ని మళ్లీ సాధారణ విద్యకు అలవాటు చేస్తున్నాయి. చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో అయితే ఏకంగా విద్యార్థులకు ట్యాబ్లు, ఫోన్లపై నిషేధాలు సైతం విధిస్తున్నారు. కానీ ఏపీ మాత్రం జగన్ సర్కారు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బైజూస్ పాఠాలంటూ విద్యార్థులపై ట్యాబ్లెట్ చదువును బలవంతంగా రుద్దుతుండటంతో పలుచోట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. కరోనా తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆన్ లైన్ తరగతులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఎన్నో ప్రతికూల పరిణామాలున్నాయనే విషయం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సంబంధాలు దెబ్బతినడమే కాకుండా... విద్యార్థుల ఏకాగ్రత తగ్గిపోవడం... టీచర్స్, పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోతే టెక్నాలజీ గాడి తప్పడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ట్యాబ్లెట్లు తరచూ మర్మమ్మతులకు గురై.. వెంటనే రిపేర్లకు నోచుకోకపోవడం.. దీనివల్ల ఆ సమయంలో పిల్లలు చదువులపై కాన్సెంట్రేట్ చేయకపోవడం వంటి లోపాలు కూడా వేధిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా బైజూస్ ట్యాబ్లతో విద్యార్ధులను ఏదో ఉద్దరిస్తున్నట్టు ప్రచార ఆర్భాటం చేస్తోంది. కరోనా తర్వాత ... ఆన్ లైన్ చదువులు బోధించడంపై చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఒకవేళ ప్రభుత్వం విద్యార్థులకు అదనంగా చదువును అందించాలనుకుంటే ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా తరగతులు పెట్టించొచ్చు. సీబీఎస్ఈ సిలబస్ కు సంబంధించిన వీడియోలను కేంద్రప్రభుత్వం ఉచితంగా ఆన్ లైన్ లో ఉంచింది. కానీ, ప్రభుత్వం బైజూస్ కంటెంట్, ట్యాబ్లెట్లతో ఎన్నికల ప్రచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నదే తప్ప... పిల్లల పరిస్థితి, అభ్యసన సామర్థ్యాలను పట్టించుకోవడం లేదు. బైజూస్ కంటెంట్ ఉన్నప్పటికీ రూ. లక్షలు పెట్టి విద్యాశాఖ ఇటీవల ఉపాధ్యాయులతో మళ్లీ అదనంగా ఎందుకు వీడియో పాఠాలు చేయిస్తున్నదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చాలాచోట్ల ఇచ్చిన ట్యాబ్ లూ సరిగ్గా పనిచేయటం లేదు. అధికశాతం తరచూ మొరాయిస్తున్నాయి. ట్యాబ్ లలో సమస్య తలెత్తిన వారం రోజుల్లో మరమ్మతులు చేయలేకపోతే కొత్తవి ఇవ్వాలని గతంలో ఓ సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు. నిబంధనల ప్రకారం మూడేళ్లు వారంటీ ఉన్నా, సాక్షాత్తు ముఖ్యమంత్రే మౌఖికంగా చెప్పినా... నెలల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో రాష్ట్రంలో 30శాతం ట్యాబ్ లు ఎప్పుడూ రిపేర్లలోనే ఉంటున్నాయి. ఇదిలావుండగా... ట్యాబ్ లను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నవారికి ఆ అవకాశం ఉందా అంటే అదీ లేదు. పాఠాలు వింటున్న విద్యార్థులకు ఏమైనా సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసేవారే ఉండటం లేదు. సాధారణంగా ప్రైవేటులో బైజూస్ పాఠాలపై ఏమైనా సందేహాలు వస్తే ఆ సంస్థ ప్రతినిధులు ఆన్ లైన్ లో నివృత్తి చేస్తారు. విద్యార్థుల సందేహాలపై ఫోన్ చేస్తే సమయం ఇచ్చి ఆన్ లైన్ లో మాట్లాడతారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిలో ఆ విధానం లేదు. కేవలం కంటెంట్ వేసి... ఇవ్వడమే తప్ప అది పిల్లవాడికి ఎంతవరకు అర్థమైంది... వారి పరిస్థితి ఏమిటీ అనే పరిశీలన లేదు. బైజూస్ పాఠాలపై సమీక్షలు ఉండడం లేదు. తరగతి గది పాఠాలు, వర్క్ బుక్స్, నోటు పుస్తకాలు.. దిద్దడంపై ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నందున ఉపాధ్యాయులు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. బైజూస్ లో సందేహాలపై దృష్టి పెట్టడం లేదు. మరోవైపు ప్రభుత్వం మాత్రం బైజూస్ కంటెంట్, ట్యాబ్ ల పంపిణీని ఎన్నికల ప్రచారంగా భావిస్తోందే తప్ప పిల్లలకు కలుగుతున్న ప్రయోజనాన్ని మదింపు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు ట్యాబ్ వినియోగంపై లక్ష్యాలు పెట్టడంతో చాలామంది పిల్లలు పాఠాలు వినకుండానే వాటిని ఆన్ చేసి వదిలేస్తున్నారు. దాని నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నది శూన్యం, అధికారులు మాత్రం విద్యార్థులు రోజుకు సగటున 67 నిమిషాలు వినియోగిస్తున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి ఆన్ లైన్ చదువుల కారణంగా ఉపాధ్యాయులకు – విద్యార్థులకు మధ్య అనుసంధానం కొరవడి విద్యాప్రమాణాలు క్షీణించే పరిస్థితి దాపురించనుందని అటు విద్యాశాఖకు చెందిన మేధావుల్లోనూ, ఇటు పిల్లల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos