టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ... సోమవారం సాయంత్రం 6.08 గంటలకు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధిలోని శివాజీనగర్ వద్ద ముగిసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన పైలాన్ను ఆయన ఆవిష్కరించారు. రోడ్డుకు అభిముఖంగా 35 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటుచేశారు. పైలాన్ ముందు భాగంలో 20 అడుగుల ఎత్తు వరకు లోకేష్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. పై భాగంలో యువగళం పేరు, ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడు చిత్రాలు, టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్ చిత్రాలను తీర్చిదిద్దారు. లోకేష్ పైలాన్ను ఆవిష్కరిస్తున్న సమయంలో కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాలతో.. ‘జై తెలుగుదేశం’, ‘జయహో లోకేష్’ అనే నినాదాలతో హోరెత్తించారు. యువ నేతపై పూలవర్షం కురిపించారు. పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో.. 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కిలోమీటర్లు సాగింది. చివరి రోజు లోకేష్ 13 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటు మిత్రపక్షమైన జనసేన శ్రేణులు కూడా విశాఖకు భారీగా తరలివచ్చాయి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే యువగళం పాదయాత్రను కూడా ముగించారు. కాగా లోకేష్ చివరిరోజు పాదయాత్రలో పలు సందర్భాల్లో మాట్లాడుతూ... పోరాటాలు, ఆత్మబలిదానాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి అంగీకరించబోమని... ఆంధ్రుల ఆత్మ గౌరవం తో ముడిపడిని సంస్థను ప్రైవేటుపరం చేస్తుంటే... కేసులకు భయపడి జగన్ నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళాన్ని వినిపిస్తామన్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ప్లాంట్ను కాపాడారని, ఇప్పుడు కూడా అండగా ఉంటామని అన్నారు. మరో సందర్భంలో మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కుతూ జగన్మోహన్రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని టీడీపీ బీసీ నేత పల్లా శ్రీనివాసరావు గాజువాకలో అన్ని అనుమతులు తీసుకుని భవనం నిర్మించుకుంటే.. ఉక్కు ఉద్యమంలో పాల్గొంటున్నారన్న కక్షతో జగన్ ప్రభుత్వం దానిని కూల్చివేసిందని విమర్శించారు. గడిచిన నాలుగున్నరేళ్లలో జగన్ బీసీల ను అడుగడుగునా అణచివేసేందుకు యత్నించారని... 26 వేల మంది బీసీలపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో 55 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పటివరకు మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు సరికదా... కనీసం పరామర్శించలేదని అన్నారు. మొత్తానికి ఈ ఏడాది జనవరిలో చేపట్టిన లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos